మియాపూర్ మహాసభ ఘన విజయం మియాపూర్ మహాసభ ఘన విజయం
శేరిలింగంపల్లి అభివృద్ధికి రూ. 2000 కోట్లకు పైగా పనులకు శ్రీకారం
ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ
సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ
*తెలుగుజ్యోతి మియాపూర్ :08 జూన్*
మియాపూర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభను అఖండ విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులకు, పాత్రికేయులకు, అధికారులకు మరియు అభిమానులకు పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల అపారమైన ఆదరణ, విశ్వాసం ఈ సభ విజయానికి మూలకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు మరియు పోలీస్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా మియాపూర్ చౌరస్తాలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, భారీ ఫ్లైఓవర్ ప్రాజెక్టులు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
మొత్తం రూ. 1674.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగగా, అందులో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోనే రూ. 1213.40 కోట్ల పనులు ప్రారంభం కావడం విశేషం. అదేవిధంగా ఇప్పటికే రూ. 819.50 కోట్ల పనులు పురోగతిలో ఉండగా, మొత్తం అభివృద్ధి వ్యయం రూ. 2032.90 కోట్లకు చేరుకుంది.
ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు
మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ వరకు రూ. 530 కోట్లతో 6 లేన్ ద్విదిశ ఫ్లైఓవర్, అండర్ పాస్లు
లింగంపల్లి ఆర్ ఓ బి ఫ్లైఓవర్ రూ. 308 కోట్లు
మియాపూర్లో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల
ఖానమేట్లో రూ. 161 కోట్లతో సిఎంసీ ప్రధాన కార్యాలయం
మాదాపూర్, నానక్రామ్గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం
కొనసాగుతున్న పనులు
గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లైఓవర్ రూ. 459 కోట్లు
కాజాగుడా జంక్షన్ ఫ్లైఓవర్ రూ. 220 కోట్లు
కోర్ అర్బన్ పాఠశాలలు – రూ. 100 కోట్లు
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ – రూ. 40.50 కోట్లు
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన వసతులు అందుతాయని తెలిపారు.
అలాగే నియోజకవర్గంలో నెలకొన్న పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అపర్ణ హిల్ పార్క్ నుండి గంగారాం హనుమాన్ ఆలయం వరకు లింక్ రోడ్, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల స్థాపన, ఉషాముళ్లపూడి రోడ్డు విస్తరణ, పలు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావించారు.
ఇక హెచ్ ఏం డి ఏ లేఅవుట్ అనుమతులు ఉన్నప్పటికీ 22ఏ కింద రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీలకు న్యాయం చేయాలని, చందానగర్ పరిధిలోని వేమన కాలనీకి అనుమతులు ఇవ్వాలని, బఫర్ జోన్ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గాంధీ ప్రస్తావించిన ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం లభించిందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.