శేరిలింగంపల్లి,ఆగస్టు 11 (తెలుగు జ్యోతి):
చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ వైర్లు తగలడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

మృతుడిని గణేష్ రాథోడ్ (2 సంవత్సరాలు)గా గుర్తించారు. తండ్రి సునీల్ రాథోడ్, తల్లి స్వప్న. వీరి స్వస్థలం జహీరాబాద్ కాగా, గత రెండు నెలలుగా చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీ 47వ బ్లాక్లో నివాసం ఉంటున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. 16 బ్లాక్లకు సంబంధించిన విద్యుత్ మీటర్ బాక్స్లు ఉన్న ప్రాంతం వద్ద గేటు తెరిచి ఉండటంతో బాలుడు లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ బాలుడు మృతి చెందినట్లు తెలిసింది.ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

