కూలే ప్రమాదం ఉన్న మరో ఏడంతస్తుల భవనం తొలగింపు
శనివారం కూలిన భవనం పక్కనే ఉన్న మరో భవనానికి తీవ్ర నష్టం
ఎలాంటి అనుమతులు లేకుండా 50 గజాల్లో ఏడంతస్తుల నిర్మాణం చేసినట్లు అధికారులు వెల్లడి
పక్కనే ఉన్న భవనాలకు ముప్పు లేకుండా భారీ యంత్రాలతో అత్యంత జాగ్రత్తగా కూల్చివేత
ప్రమాదం దృష్ట్యా స్టెర్లింగ్ వైట్ఫీల్డ్ అపార్ట్మెంట్ వాసుల ఖాళీ
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు
తెలుగుజ్యోతి, గచ్చిబౌలి ఆగష్టు 23:
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి అంజయ్య నగర్లో హైడ్రా–సీఎంసీ సంయుక్తంగా కూల్చివేత చర్యలు చేపట్టింది. శనివారం ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో పక్కనే ఉన్న మరో ఏడంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ భవనం కూడా ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని సీఎంసీ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో భవనాన్ని తొలగించాలని సీఎంసీ అధికారులు హైడ్రాను కోరడంతో ఆదివారం కూల్చివేత పనులు ప్రారంభించారు. భవనాల మధ్య ఏమాత్రం ఖాళీ లేకపోవడంతో పక్కనున్న నిర్మాణాలకు నష్టం కలగకుండా ‘బాహుబలి’ భారీ యంత్రంతో అత్యంత జాగ్రత్తగా భవనాన్ని తొలగిస్తున్నారు.
ఇప్పటికే ప్రమాదకర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమీపంలోని స్టెర్లింగ్ వైట్ఫీల్డ్ అపార్ట్మెంట్ నివాసితులను ఖాళీ చేయించారు. భవనం తొలగింపు ప్రాంతంలోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శనివారం సాజిద్కు చెందిన భవనం కూలిపోవడంతో జయదర్శిని అపార్ట్మెంట్ సీ బ్లాక్ కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆంజనేయనగర్లో కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వరుసగా పేకమేడల్లా ఏడంతస్తుల భవనాలు నిర్మించడం ఇప్పుడు ప్రమాదకరంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమాదకర భవనాలను గుర్తించి, అవసరమైన చోట హైడ్రా–సీఎంసీ సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయి.

