ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై ఆగ్రహం
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్
తెలుగుజ్యోతి వికారాబాద్ :09 జూన్
హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ, వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

నాయకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీజుల నియంత్రణకు స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకమైన ఫీజుల విధానాన్ని తీసుకురావాలని, కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వినిపించారు.

