మాదాపూర్లో రెసోనెన్స్ హాస్టల్లో కలకలం
కలుషిత ఆహారంప్రశ్నిస్తే దాడి.. అద్దాలు ధ్వంసం
తెలుగుజ్యోతి మాదాపూర్ :08 జులై :

మాదాపూర్ చంద్ర నాయక్ తండాలోని రెసోనెన్స్ హాస్టల్ శాతవాహన క్యాంపస్-3లో కలుషిత ఆహారం బుధవారం కలకలం రేపింది. విద్యార్థులు తినే అన్నంలో పురుగులు, సాంబారులో బొద్దింకలు ఉండటంతో విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు.ఈ విషయాన్ని హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులకు నిర్వాహకులు “ఇలాగే ఉంటుంది, నచ్చితే తినండి” అంటూ సమాధానం ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.మాటామాటా పెరిగి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఆవేశంలో కాలేజీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. క్యాంపస్లో గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కలుషిత ఆహారం తిని కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ ఘటనతో పాటు విద్యార్థులు, సిబ్బంది మధ్య జరిగిన దాడి ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆహార భద్రతాధికారులు తనిఖీలు చేయనున్నట్లు సమాచారం

