
తెలుగుజ్యోతి, హైదరాబాద్ జులై 23
నానక్రామ్గూడలోని స్టార్ క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక నొప్పి నివారణ–సహాయక సంరక్షణ సేవలు ప్రారంభమయ్యాయి. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సేవలను ప్రారంభించారు. సమగ్ర క్యాన్సర్ చికిత్సతో పాటు ప్రత్యేక నొప్పి నివారణ, సహాయక సంరక్షణ సేవలను నేరుగా అందిస్తున్న హైదరాబాద్లోని తొలి ప్రైవేట్ ఆసుపత్రిగా స్టార్ హాస్పిటల్స్ నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గోపీచంద్ మన్నం, డాక్టర్ రమేష్ గూడపాటి, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయినాథ్ బెతనాభొట్ల, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ విపిన్ గోయల్, మాజీ డైరెక్టర్ జైరాజ్ కుమార్, సామాజికవేత్త ప్రదీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ రోగుల సేవలో విశేష కృషి చేసిన ప్రముఖులను సన్మానించారు. పేద రోగుల చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ప్రదీప్ చౌదరి, వెయ్యి ఉచిత క్యాన్సర్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన డాక్టర్ గౌడ శ్రీహరి, ప్రభుత్వ రంగంలో సహాయక సంరక్షణ సేవలను విస్తరించిన డాక్టర్ గాయత్రి పలాట్, అలాగే సేవాభావంతో పనిచేసిన స్టార్ హాస్పిటల్స్ సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
కొత్తగా ప్రారంభించిన ఈ సేవల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ అయిన తొలి రోజు నుంచే నొప్పి నియంత్రణ, ఇతర లక్షణాల నిర్వహణ, ఆధునాతన నొప్పి నివారణ విధానాలు, మానసిక మద్దతు, పోషకాహార సలహాలు, పునరావాస సేవలు, అత్యవసర సహాయక సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, క్యాన్సర్ చికిత్సలో రోగి జీవన నాణ్యతను మెరుగుపరచడం అత్యంత ముఖ్యమని, సహాయక సంరక్షణను ప్రధాన చికిత్సతో సమాంతరంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, కేవలం వ్యాధిని నయం చేయడమే కాకుండా ప్రతి రోగికి శారీరక, మానసిక, సామాజిక పరంగా సంపూర్ణ సహాయాన్ని అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

