తెలుగు జ్యోతి న్యూస్ ఆమదాలవలస నియోజకవర్గం:
ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ( తారు రోడ్డులను) రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రహదారులను ప్రారంభించారు.
ప్రారంభించిన రోడ్ల వివరాలు1. తండ్యం గ్రామం -మూడు మర్రి చెట్ల వరకు–నిధులు రెండు కోట్లు 2. పొందూరు నుండి లొట్ట పేట వరకు నిధులు –1.2 కోట్లు
3 పొందూరు నుండి సర్వేశ్వరపురం వరకు నిధులు 2.4 కోట్లు 4. గూనన పేట నుండి మంగంపేట వరకు నిధులు 1 కోటి
ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి రహదారులే ప్రధాన ఆధారమని, మంచి రోడ్లు ఉంటేనే వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం వంటి అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గతంలో దెబ్బతిన్న రహదారుల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి గ్రామానికి నాణ్యమైన రహదారులను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.రూ.7 కోట్లతో నిర్మించిన నూతన బీటీ రహదారులు పూర్తికావడం వల్ల గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డులకు, వ్యాపార కేంద్రాలకు తక్కువ సమయంలో తరలించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, ఉద్యోగులు తమ కార్యాలయాలకు, ప్రజలు ఆసుపత్రులకు, అత్యవసర సేవలకు వేగంగా చేరుకునేందుకు ఈ రహదారులు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.ఆమదాలవలస నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, సాగునీరు, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నియోజకవర్గంలోని ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరంగా ఉండదని స్పష్టం చేశారు.అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిగురుపల్లి రామ్మోహన్, బలగ శంకర్ భాస్కర్ , అన్నెపు రాము, అనకాపల్లి రంగనాయకులు , స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి , బాడాన శేషగిరి కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

